మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నదని మండిపడ్డారు. వాటిని రక్షించుకొనేందుకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం నిర్వహించిన సీఐటీయూ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టు తెలిపారు. సమ్మెకు అన్ని జాతీయ సంఘాలు మద్దతు తెలిపినట్టు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ.. కార్పొరేట్ సంస్థలకు అధిక సబ్సిడీలు అందించి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి భవిష్యత్తులో దానిని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, నాయకులు వంగూరు రాములు, లక్ష్మీనారాయణ, డబ్బికార్ మల్లేశ్ పాల్గొన్నారు.