బెంగళూర్ : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముస్లిం నేతలు గురువారం కలిసి హిజబ్ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్ధల్లో హిజబ్పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన నేపధ్యంలో మాజీ సీఎంతో ముస్లిం నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ తేదీలను వెల్లడించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు జరగనున్న నేపధ్యంలో తక్షణమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ కోరగా పరీక్షలకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఈ అంశాన్ని సంచలనంగా చేయవద్దని వారించారు.
ఈ వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందిస్తూ హిజబ్ ధరించే మహిళల విద్య, శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా విద్య, శాంతిభద్రతల పర్యవేక్షణ, మతసామరస్యం వంటి అంశాలపై కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.