బెంగళూరు: కర్ణాటక బీజేపీలో విభేదాలు ముదిరిపాకాన పడ్డాయా? కమలనాథుల కుమ్ములాట తీవ్రమైందా? నాలుగు నెలలు కూడా గడువకముందే ముఖ్యమంత్రి మారనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి ఓ మంత్రి వ్యాఖ్యలు! మంత్రి మురుగేశ్ నిరాణి త్వరలో సీఎం అవుతారని మరో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప బాహాటంగా చెప్పారు. నిరాణికి సీఎం అయ్యే సత్తా ఉందని, బీసీలు, పేదలు, అట్టడుగు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఆయన సేవ చేయగలరని కొనియాడారు. బొమ్మై క్యాబినెట్లో ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి కాగా నిరాణి చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి. నిరాణి నియోజకవర్గమైన బిలాగిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ సీఎం మార్పు అంశాన్ని ప్రస్తావించారు. నిరాణి సీఎం అవుతారని అనగానే కార్యకర్తలు పెద్దపెట్టున హర్షం వ్యక్తం చేశారు.
కర్ణాటక సీఎంగా బీఎస్ యెడియూరప్పకు అధిష్టానం ఉద్వాసన పలికి నాలుగు నెలలవుతున్నది. యెడ్డీపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోవడంతో బీజేపీ అధిష్టానానికి ఆయనను మార్చకతప్పలేదు. యెడ్డీ వారసుడిగా ఆయన సూచించిన బొమ్మైకే సీఎం పదవి కట్టబెట్టింది. అయినా బీజేపీలో అసంతృప్తి చల్లారలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప వ్యాఖ్యలు బీజేపీలో విభేదాలకు అద్దంపడుతున్నాయి. ఇవి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గండికొడతాయని అంచనా వేస్తున్నారు.