బెంగుళూరు: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ను కిరాతకంగా చంపిన ఘటనపై కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కామెంట్ చేశారు. హత్యకు పాల్పడిన హంతకులకు హత్యతోనే గుణపాఠం చెప్పాలని, లేదంటే వాళ్లకు సరైన శిక్ష వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్యలు సరికాదన్నారు. ఇటీవల ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చే రీతిలో సోషల్ మీడియాలో టైలర్ కన్హయ్యలాల్ కామెంట్ పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు.. టైలర్ కన్హయ్యను హత్య చేశారు. దుస్తుల కొలతలు ఇచ్చేందుకు వచ్చినట్లు వచ్చి.. తమ వద్ద ఉన్న కత్తులు తీసి దాడి చేశారు. టైలర్ తలను నరికేశారు. తమ వద్ద ఉన్న ఫోన్లో వీడియో కూడా తీశారు. ఆ మర్డర్ తామే చేశామని, ప్రధాని మోదీని బెదిరిస్తూ కూడా మరో వీడియోను రిలీజ్ చేశారు.
మోదీని బెదిరిస్తూ విడుదల చేసిన వీడియోపై కర్నాటక మంత్రి ఈశ్వరప్ప స్పందిస్తూ.. ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరించడాన్ని ఏ జాతీయవాది కూడా సహించరాదన్నారు. అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఉండరాదన్నారు. దేశంలో శాంతిని రక్షించుకోవాలని ప్రధాని చెబుతుంటారని, అంటే దాని అర్థం హంతకులను రక్షించడం కాదని ఈశ్వరప్ప అన్నారు. నుపుర్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆ టైలర్ను హత్య చేసినట్లు ఇద్దరు హంతకులు ఓ వీడియోలో తెలిపారు. ఆ నిందితుల్ని రాజ్సమంద్ జిల్లాలోని బీమ్ ఏరియాలో అరెస్టు చేశారు.