సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యవహారంలో డాన్గా చలామణి కావాలనుకునే తననే అవమానించినట్లు మాట్లాడుతున్నాడనే కోపంతో తన దాయాదిని నాటు తుపాకీతో కాల్చి చంపిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఓల్డ్ అల్వాల్కు చెందిన తోట నరేందర్రెడ్డి, తోట విజయభాస్కర్రెడ్డి అన్నదమ్ముల పిల్లలు. నరేందర్రెడ్డి 10వ తరగతి వరకు చదివి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా, క్యాబ్ నిర్వహణ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్తో పాటు స్థానికంగా డాన్లా ఉండాలని నరేందర్రెడ్డి ఆర్భాటాలు చేసేవాడు. ప్లాట్లు అమ్మడం, కొనడం చేస్తూ.. కమీషన్ తీసుకోవడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తుండేవాడు. అలాగే విజయభాస్కర్రెడ్డి కూడా రియల్ ఎస్టేట్లో ప్లాట్లు క్రయ విక్రయాలు చేస్తూ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి కమీషన్ ఏజెంట్లుగా ప్లాట్ల క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వం వహించారు.
అవమానించినట్లు మాట్లాడుతుంటే..
విజయభాస్కర్రెడ్డి తనను అవమానించినట్లు మాట్లాడుతూ, అవతలి వ్యక్తులకు మద్దతుగా మాట్లాడడం వంటి ఘటనలను నరేందర్రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. ప్లాట్ల విషయంలో జోక్యం చేసుకోవడం, తరచూ ఇబ్బంది కరంగా భాస్కర్రెడ్డి మారుతున్నాడని కోపం పెంచుకొని.. అతడిని అంతం చేయాలని ప్లాన్ వేశాడు. ఇదిలాఉండగా ఏడాది కిందట మధ్యప్రదేశ్కు చెందిన రామకుమార్ అనే వ్యక్తి వద్ద రూ. 30 వేలకు రెండు దేశవాళీ పిస్టోళ్లు,ఆరు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్లాట్ విషయంలో అల్వాల్కు చెందిన మాజీ కౌన్సిలర్ మాధవ్కు నరేందర్రెడ్డికి మధ్య 2018లో వివాదాలు ఏర్పడ్డాయి. అల్వాల్ పోలీసులు మాధవ్పై కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో మాధవ్తో ఏర్పడ్డ వివాదంతో అతడిని చంపాలని ప్లాన్ వేసి..మధ్యప్రదేశ్కు వెళ్లి ఆయుధాలను సమకూర్చుకున్నాడు.
ప్లాట్ రిజిస్ట్రేషన్కు వెళ్దామని..
ఇటీవల అల్వాల్ భరత్నగర్లో భాస్కర్రెడ్డి 120 గజాల ప్లాట్ను అగ్రిమెంట్ చేసుకొని, మధ్యవర్తిగా వ్యవహరించిన నరేందర్రెడ్డికి ప్లాట్ యజమానులకు ఇవ్వాలంటూ రూ. 3 లక్షలు అందజేశాడు. ఆ డబ్బులు వారికి ఇవ్వకుండా నరేందర్రెడ్డి సొంతానికి వాడుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం నడుస్తున్నది. తాను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తానని, సదరు యజమానులతో మాట్లాడానంటూ నమ్మించి సోమవారం మిగతా డబ్బు తీసుకొని బేగంపేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలని నరేందర్రెడ్డి సూచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు భాస్కర్రెడ్డి తన కారులో నరేందర్రెడ్డిని తీసుకొని బయలుదేరాడు. ‘ప్లాట్ యజమానులు డాక్కుమెంట్లు తెస్తానన్నారు.. కొద్దిసేపు ఇక్కడ ఆగుతామం’టూ నరేందర్రెడ్డి చెప్పడంతో భాస్కర్రెడ్డి ఆర్టీసీ కాలనీలో కారును ఆపాడు. ఇంతలో కారు దిగి..బయటకు వెళ్లిన నరేందర్రెడ్డి..వెనుక సిట్లోంచి లోపలికి వచ్చి.. తన నాటు తుపాకీతో భాస్కర్రెడ్డి తలపై కాల్చి.. నగదు బ్యాగ్ను తీసుకొని పరారయ్యాడు. కారు అక్కడే ఆగి ఉండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు మృతుడు తోట విజయభాస్కర్రెడ్డి అని గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తలలో బుల్లెట్..
పోస్టుమార్టంలో మృతుడి తలలో నుంచి బుల్లెట్ బయటపడింది. ఈ క్రమంలో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం 48 గంటల్లోనే నరేందర్రెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, తూటాలు, రూ. 7.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.