సిద్దిపేట/సిద్దిపేట టౌన్, జనవరి 31: సినిమా సీన్ షూట్ చేశారా! అన్నట్టుగానే.. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి కారులోంచి డబ్బు దోచికెళ్లిన ఘటన సిద్దిపేటలో చోటుచేసుకొన్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాటకు చెందిన రియల్టర్ నర్సయ్య సిద్దిపేటలో స్థిరపడ్డారు. ఆయనకు హౌజింగ్బోర్డు కాలనీలో ఉన్న ప్లాట్ను శ్రీధర్రెడ్డికి రూ.60 లక్షలకు విక్రయించాడు. మూడు విడతల్లో చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. చివరి విడత డబ్బు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేందుకు సోమవారం నర్సయ్య తన డ్రైవర్ పరశురాములుతో కలిసి కారులో ఇన్నోవాలో సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. శ్రీధర్ రెడ్డి తాను ఇవ్వాల్సిన రూ.43.50 లక్షలు చెల్లించాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి సంతకం పెట్టేందుకు నర్సయ్య వెళ్లగా గుర్తుతెలియని దుండగులు మాస్క్లు ధరించి బైక్పై వచ్చారు. కారుపై వెనుక నుంచి దాడికి తెగపడ్డారు. గమనించిన డ్రైవర్ పరశురాములు వాహనాన్ని కొంతదూరం తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ముందుకొచ్చి కారు అద్దంపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. భయపడి డ్రైవర్ కేకలు వేయటంతో, అతని తొడపై కాల్చి గాయపర్చారు. మరో దుండగుడు పక్క సీట్లో ఉన్న డబ్బుల సంచిని తీసుకొని పరారయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండుగులు ఉపయోగించిన 9ఎంఎం తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులను 24 గంటల్లో పట్టుకొంటామని, 15 బృందాలతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నదని, సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.