సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డిలతో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై ఈఎన్సీ, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు తదితరులతో దానకిశోర్ సమీక్షించారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికలతో పూర్తి పటిష్టమైన చర్యలు చేపట్టాలని దానకిశోర్ సూచించారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) అన్ని వేళలా అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని, వరద ముంపునకు చేపట్టిన పనులు 52 శాతం పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలోగా నాలాలన్నింటినీ శుభ్రం చేయాలన్నారు. 1304 కి.మీ పొడవు నాలాలు ఉన్నాయని, భద్రత చర్యల్లో భాగంగా నాలా ఆడిట్ చర్యలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దానకిశోర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.