రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): బంధువుల ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు బూడిద బాలనర్సయ్య (43)కు 20 ఏండ్ల జైలుశిక్ష, 25వేల జరిమానా విధిస్తూ.. బాధిత బాలికకు పదిలక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి హరీఫ తీర్పునిచ్చారు. అదనపు పీపీ కోమలత కథనం ప్రకారం.. మంచాల మండలం లోయపల్లిలోని బంధువుల ఇంటికి బాధిత బాలిక తన తల్లితో కలిసి వచ్చింది. 2016, జూన్ 28న అమాయకురాలైన ఆ బాలికకు మాయమాటలు చెప్పిన నిందితుడు తనతో తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి మరో గ్రామంలో కాపురం పెట్టాడు. బాలిక కోసం వెతుకుతున్న తల్లికి గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో మంచాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు బాల నర్సయ్యను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
తనను ప్రేమించాలంటూ బాలిక వెంటపడుతూ వేధిస్తున్న హయత్నగర్ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన నిందితుడు కందికంటి భానుచందర్ (20)కు రెండేళ్ల జైలుశిక్ష, మూడువేల జరిమానా విధిస్తూ.. బాలిక కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది.