ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కీరన్ పొలార్డ్ వంటి కీలక ఆటగాళ్లెవరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో ఆ జట్టు వరుసగా ఓటములు చవిచూస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.
‘‘ముంబై గెలవాలంటే.. టాపార్డర్లో రోహిత్, ఇషాన్ కిషన్ భారీ స్కోర్లు చేయాలి. ఓపెనర్లుగా 20 ఓవర్లు ఆడే అవకాశం వీళ్లిద్దరికీ ఉంటుంది. ఇవే పిచ్లపై జోస్ బట్లర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబై టాపార్డర్ కూడా అదేమాదిరి రాణిస్తేనే ఆ జట్టు విజయాల బాట పడుతుంది’’ అని ఆకాష్ చోప్రా అన్నాడు. కేవలం సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆడితే ఆ జట్టు గెలవడం కష్టమని, అతనితోపాటు మిగతా ఆటగాళ్లు కూడా సత్తా చాటాలని సూచించాడు.
రిటైన్ చేసుకున్న వెటరన్ ఆటగాడు పొలార్డ్ కూడా బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉందన్నాడు. అప్పుడే ముంబైకి విజయాలు దక్కుతాయని, లేదంటే పరాజయాల నుంచి తప్పించుకోవడం కష్టమని పేర్కొన్నాడు.