శ్రీనగర్: మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. (Poor Man Donated Egg) ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపోయింది. జమ్ముకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేపట్టారు. ఒక పేద ముస్లిం ఒక గుడ్డును విరాళంగా ఇచ్చాడు. దీనిని స్వీకరించిన కమిటీ సభ్యులు మిగతా వస్తువులతో పాటు వేలం పాట నిర్వహించారు.
కాగా, పేద వ్యక్తి విరాళంగా ఇచ్చిన ఆ గుడ్డును వేలం పాటలో దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. తొలుత వందలు, వేల రూపాయాల్లో దక్కించుకున్న కొందరు ప్రతిసారి దానిని తిరిగి కమిటీ సభ్యులకు అందజేశారు. ఇలా పలువురి చేతులు మారిన ఆ గుడ్డుకు పలుసార్లు వేలంపాట నిర్వహించారు. చివరకు ఒక వ్యక్తి రూ.70,000కు ఆ గుడ్డును దక్కించుకున్నాడు.
మరోవైపు ఆ గుడ్డుకు నిర్వహించిన అన్ని వేలం పాటల ద్వారా మొత్తం రూ.2,26,000 వచ్చాయని కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆ గుడ్డు వేలం పాటను ముగించినట్లు చెప్పారు. అయితే ఐదు రూపాయల విలువైన గుడ్డు వేలం పాటలో లక్షల్లో నిధులు సమకూర్చిన విషయం తెలుసుకుని స్థానికులు ఆశ్చర్యపోయారు.