224 పరుగుల ఛేదనలో భాగంగా 14 ఓవర్లలో రాజస్థాన్ స్కోరిది 128/6. ఆ జట్టు విజయానికి 36 బంతుల్లో 96 పరుగులు కావాలి. రాజస్థాన్ గెలవడం కష్టమే అనుకున్నారు అందరు. కానీ టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లంతా డగౌట్లో ఉంటే ఓపెనర్గా వచ్చిన బట్లర్ మాత్రం ఒంటరిపోరాటం చేసి ఆ జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. సూపర్ సెంచరీతో రాయల్స్ గెలుపు జోరును మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఐపీఎల్లో అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డును రాజస్థాన్ ఖాతాలో వేసుకుంది. తొలుత విండీస్ వీరుడు సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో కోల్కతా 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇద్దరి శతకాలతో హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్లో పరుగుల జడివానలో తడిసిముద్దయిన 24 గంటలు గడవకముందే కోల్కతా-రాజస్థాన్ మ్యాచ్ ఐపీఎల్ అభిమానులను మరో ‘రన్ ఫీస్ట్’ అలరించింది.
RR vs KKR | కోల్కతా: పేరుకు తగ్గట్టే రాజస్థాన్ ‘రాయల్స్’ విక్టరీ కొట్టింది. కోల్కతా నిర్దేశించిన 224 పరుగుల ఛేదనలో ఒకదశలో గెలుపు కష్టమనుకున్న మ్యాచ్లో జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్, 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాజస్థాన్కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఛేదనలో 8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా రాజస్థాన్ రికార్డుల్లోకెక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ (56 బంతుల్లో 109, 13 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్యాట్తో సెంచరీ బాదిన నరైన్ బౌలింగ్ (2/30)లోనూ రాణించాడు. బట్లర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సీజన్లో రాజస్థాన్కు ఇది ఆరో విజయం కాగా కోల్కతాకు రెండో పరాభవం.
ఈ సీజన్లో ఓపెనర్గా వస్తూ సంచలన ఇన్నింగ్స్లు ఆడుతున్న నరైన్ మరోసారి రెచ్చిపోయాడు. ఆరంభంలో నెమ్మదిగానే ఆడిన నరైన్ ఆరో ఓవర్ నుంచి జోరు పెంచాడు. గత మ్యాచ్లో రాణించిన ఫిల్ సాల్ట్ (10) విఫలమైనా అంగ్క్రిష్ రఘువంశీ (18 బంతుల్లో 30, 5 ఫోర్లు) కలిసి కేకేఆర్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కుల్దీప్సేన్ ఆరో ఓవర్లో భారీ సిక్సర్తో విధ్వంసానికి తెరతీసిన నరైన్.. 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (11), ఆండ్రీ రస్సెల్ (13) విఫలమైనా నరైన్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ 12వ ఓవర్లో 6, 4, 4 బాదిన అతడు.. 16వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో 6, 4, 6, 4తో 49 బంతుల్లోనే తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని నమోదుచేశాడు. ఆఖర్లో రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లూ బ్యాట్కు పనిచెప్పినా ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. క్రీజులో ఉన్నంతసేపు జైస్వాల్ (9 బంతులత్లో 19, 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ దంచికొట్టారు. కెప్టెన్ శాంసన్ (12) నిరాశపరిచాడు. వైభవ్ అరోరా వేసిన 6వ ఓవర్లో బట్లర్ ఓ సిక్సర్ బాదగా పరాగ్.. 4, 6, 4 తో 23 పరుగులు రాబట్టారు. హర్షిత్ 8వ ఓవర్లో 6,4 కొట్టిన పరాగ్.. అదే ఓవర్లో భారీ షాట్ ఆడి రస్సెల్ చేతికి చిక్కాడు. ధ్రువ్ జురెల్ (2) మరోసారి చేతులెత్తేశాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 9వ ఓవర్ నుంచి రాజస్థాన్ స్కోరు వేగం నెమ్మదించింది. 9వ ఓవర్ నుంచి 14 వ ఓవర్ దాకా ఆ జట్టు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.
15వ ఓవర్ తర్వాత బట్లర్ గేర్ మార్చాడు. చక్రవర్తి 15వ ఓవర్లో 4 ఫోర్లు కొట్టగా.. అశ్విన్ (8) స్థానంలో వచ్చిన రోవ్మన్ పావెల్ (13 బంతుల్లో 26, 1 ఫోర్, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఆఖరి 3 ఓవర్లలో ఆ జట్టు విజానికి 46 పరుగులు అవసరమయ్యాయి. పావెల్ నిష్క్రమించినా అవేశ్ ఖాన్ (0 నాటౌట్)ను నాన్ స్ట్రైయికర్ ఎండ్లో నిలబెట్టి దంచికొట్టాడు. స్టార్క్ 17వ ఓవర్లో 18 పరుగులు రాబట్టిన బట్లర్.. హర్షిత్ రాణా ఓవర్లో 19 పరుగులు పిండుకోవడంతో పాటు ఈ లీగ్లో ఏడో సెంచరీ పూర్తిచేశాడు. వరుణ్ చక్రవర్తి ఆఖరి ఓవర్లో చివరి బంతికి విన్నింగ్ రన్ కొట్టి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లాడు.
కోల్కతా : 20 ఓవర్లలో 223/6 (నరైన్ 109, రఘువంశీ 30, అవేశ్ 2/35, కుల్దీప్ 2/46).
రాజస్తాన్: 20 ఓవర్లలో 224/8 (బట్లర్ 107 నాటౌట్, పరాగ్ 34, నరైన్ 2/30, వరుణ్ 2/36)