ముంబై : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించారు. వారిలాగానే ముంబైకి చెందిన చెఫ్ పంకజ్ నెరూర్కర్ సైతం కొవిడ్-19 విసిరిన సవాళ్లతో వీధినపడ్డాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గ్రాండ్ హయత్ వంటి ఫైవ్ స్టార్ హోటళ్లలో పనిచేసిన పంకజ్ ఉద్యోగాన్ని వీడి మల్వానీ వంటకాలతో ‘ఖడ్పే’ పేరిట ఫుడ్ స్టాల్ను ప్రారంభించాడు. ఇక ఫుడ్ స్టాల్ను లాంఛ్ చేసిన కొద్ది రోజులకే కరోనా వైరస్ వ్యాప్తితో నగరంలోని ప్రభాదేవి ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసిన రెండు రెస్టారెంట్లూ మూతపడ్డాయి. సొంత వ్యాపారం ప్రారంభించిన కొద్దిరోజులకే భారీ ఎదురుదెబ్బ తగిలినా డీలా పడని పంకజ్ కుటుంబాన్ని పోషించుకునేందుకు పరిస్ధితులను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను స్వయంగా వండిన సంప్రదాయ మహారాష్ట్ర ఆహారాన్ని స్వయంగా తన కారులోనే ప్రజలకు సర్వ్ చేయడం ప్రారంభించాడు.
కస్టమర్లకు కారు నుంచి పార్శిళ్లను అందచేసి నానో ఫుడ్గా మహారాష్ట్ర వంటకాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నానని పంకజ్ చెప్పుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబర్లో తన ఇంటి ఎదుటే పార్క్ చేసిన తన నానో కారులో తాను వండిన ఆహారాన్ని విక్రయించడం మొదలుపెట్టాడు. తొలుత కొద్దిపాటి కస్టమర్లే నానో ఫుడ్ను కొనుగోలు చేసినా ఆ తర్వాత కస్టమర్ల సంఖ్య పెరగడంతో మెనూలో నూతన వంటకాలనూ చేర్చాడు. చికెన్, ఫిష్ థాలీ, సుర్మా ఫ్రై, కొలంబి పలావ్, భక్రి వంటి వంటకాలను సిద్ధం చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, డిన్నర్లను తనదైన వంటకాలతో కస్టమర్లకు అందిస్తూ ఆకట్టుకున్నాడు. త్వరలోనే నగరంలోని మరిన్ని ప్రాంతాలకు కార్ స్టాల్ను విస్తరిస్తానని పంకజ్ ధీమాగా చెబుతున్నాడు. మహమ్మారి రూపంలో బతుకు భారమైనా తనదైన ఆత్మవిశ్వాసంతో పంకజ్ యువతకు ఆదర్శంగా నిలిచాడని పలువురు ప్రశంసిస్తున్నారు.