హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆదివారం కుటుంబసభ్యులు ఆయనను యశోద దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ములుగు సిద్ధాంతిగా ఖ్యాతిపొందిన రామలింగేశ్వర సిద్ధాంతి.. 30 ఏండ్లుగా జ్యోతిషుడిగా విశేష సేవలు అందించారు. టీవీ ప్రోగ్రామ్స్లో వార ఫలాలు చెప్తూ.. ఆయన ఎంతో మందికి చేరువయ్యారు. ఆయన గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సినీనటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేల ప్రదర్శనలు ఇచ్చారు. రామలింగేశ్వర సిద్ధాంతి మృతి పట్ల జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.