వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ములుగుటౌన్/భూపాలపల్లి రూరల్, మార్చి30: ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. పల్లెప్రగతి, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో నిర్వహించారు. ధాన్యం చివరి గింజవరకూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. హరిత హారం మొక్కలు, నర్సరీల్లో ఉన్న మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజు కనీసం 100 మంది కూలీలు పని చేసేలా స్వయం ఉపాధి పనులను నిర్వహించాలని అన్నారు. ములుగులో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి పాల్గొన్నారు. భూపాలపల్లిలో సంయుక్త కలెక్టర్ స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్, డీపీవో ఆశాలత, డీఆర్డీవో పురుషోత్తం, డీఏవో విజయ భాస్కర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, పౌరసరఫరాల మేనేజర్ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.