ములుగు టౌన్, డిసెంబర్ 1 : మాతృభాషలో బోధన విద్యార్థి భవిష్యత్తుకు సోపానం. అందుకే భాష, సాహిత్యం, సామాజిక నేపథ్యాలకు మన తెలుగు పాఠ్యాంశాల్లో చోటుకల్పించి వారి ఉన్నతికి తోడ్పడుతున్నారు. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ ద్వితీయ సంవత్సరం వరకు మాత్రమే ఉన్న తెలుగు పాఠాలను.. యూజీసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది తృతీయ సంవత్సరం(5, 6 సెమిస్టర్లు)లో సాహితీ దుందుభి పేరిట ప్రత్యేక పాఠ్య ప్రణాళికను తీసుకొచ్చారు. ఇలా ఒక్కో తరగతిలో ఒక్కో కొత్త పాఠాన్ని చేర్చడం.. అవి చెప్పే సందేశాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత పెంపొందిస్తున్నది. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉన్న తెలుగు పాఠ్యాంశాలపై ప్రత్యేక కథనం.
6వ తరగతిలో పర్యావరణ పరిరక్షణపై..
నవ వసంతం-1 పేరుతో ఆరో తరగతి తెలుగు వాచకంలో చెరువు పాఠం ‘బతుకమ్మ గొప్పదనం, పర్యావరణ పరిరక్షణ, చీమలబారుతో స్వీయ క్రమశిక్షణ, పొదుపు’ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ‘కాపాడుకుందాం’ పాఠంలో స్వచ్ఛభారత్ అవసరాన్ని చెబుతుంది. పొట్లపల్లి రామారావు రాసిన ‘వ్యక్తిత్వ వికాసం’ విద్యార్థులకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఎలా మనుగడ సాగించాలో వివరిస్తుంది.
7లో లక్ష్యసాధన
నవవసంతం-2 పేరుతో ఏడో తరగతి ప్రేరణలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం జీవితం ద్వారా వ్యక్తిత్వ వికాసం, ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని ఎలా సాధించాలో వివరిస్తుంది. ఆడపిల్ల చదువు అవసరాన్ని సీత ఇష్టాల
ద్వారా చెబుతారు.
8లో వ్యవసాయం ప్రాముఖ్యత
నవ వసంతం-3 ఎనిమిదో తరగతి తెలుగులో కాపుబిడ్డ పాఠం రైతు జీవితం వ్యవసాయ ప్రాముఖ్యతను వివరిస్తుంది. తమ నైపుణ్యాలతో రాణిస్తున్న కులవృత్తుల వారిని తక్కువగా చూడొద్దనే సందేశం చాటింది.
9లో సంభాషణ చాతుర్యం
సింగిడి-1 పేరుతో తొమ్మిదో తరగతిలో ఎవరితో ఎలా మాట్లాడాలో వాగ్భూషణం సందేశాన్నిస్తుంది. తీయని పలకరింపు పాఠం వృద్ధులకు ఆప్యాయతను పంచాలంటుంది. అలాగే లేఖ ఎలా రాయాలో నేర్పిస్తుంది.
10లో పఠానాభిలాష
సింగిడి-2లో పదో తరగతిలో తెలంగాణ భాష, మాండలికాల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. భూమిక పాఠం విద్యార్థులు తమ పఠనాభిలాషను ఎలా పెంపొందించుకోవాలో సూచిస్తుంది. ఇంటర్మీడియట్ ప్రథమం(నవోదయం)లో లేఖ రచన పోటీ పరీక్షలకు వ్యాసం రాయడం వంటి పాఠాలున్నాయి. అనువాదంలో మౌలిక అంశాలు తెలుసుకోవచ్చు. తెలుగు పదాలు ఉర్దూ మూలాలు, తెలంగాణ జాతీయాలు, జానపదుల బతుకమ్మ పండగ వ్యాసం ప్రత్యేకంగా ఉంది. ఇంటర్మీడీయట్ ద్వితీయ(నవోదయం)లో సంభాషణ, రచనా నైపుణ్యం, భాషాభాగాలు సంక్షిప్తీకరణ వ్యాసాలు పోటీ పరీక్షలు రాసే వారికి ఉపయోగపడతాయి. జానపద కళారూపం, చిందు యక్షగానం, మా బాగోతం, చిందు ఎల్లమ్మ, స్వగతం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
సాహితీ దుందుభి
డిగ్రీ విద్యార్థులకు(ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్) తెలుగు పాఠ్యాంశాలల్లో ప్రాచీన, ఆధునిక సాహిత్యం, వ్యాకరణ అంశాలు ఉన్నాయి. తృతీయ సంవత్సరం వారికి సాహితీ ప్రక్రియతో పాటు వ్యాసరచనను పరిచయం చేశారు. డిగ్రీ పూర్తయ్యేసరికి వక్తగా, పరిశోధకుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా రాణించేలా తీర్చిదిద్దారు.
నైపుణ్యం పెంచుతుంది..
డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన తెలుగు పాఠ్య ప్రణాళిక సాధారణ విద్యార్థిని సాహిత్య జిజ్ఞాసుడిగా, భాషాభిమానిగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక నైపుణ్యం పెంపొందించేందుకు మార్గదర్శకంగా ఉంది.