జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్
మిరుదొడ్డి, మే 19 : రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీకల్చర్ ఏడీ ఇంద్రాసేనారెడ్డి, ఎంపీపీ సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్తయ్యతో కలిసి ఆయిల్పామ్, మల్బరీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్పామ్, మల్బరీ పంట సాగు చేసిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నదని తెలిపారు.
రైతులు పండించిన ఆయిల్పామ్ పంటను ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. కిసాన్ నమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులు రూ.6 వేలు పొందాలంటే ప్రతిఒక్కరూ ఈనెల 31లోపు ఈ-కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై అందజేస్తున్న జీలుగ, జనుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీలుగ, జనుము విత్తనాలతో భూములు పూర్తిగా సారవంతంగా మారుతాయన్నారు. మిరుదొడ్డి మండలవ్యాప్తంగా ఉన్న భూముల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నాయని చెప్పారు. వానకాలంలో రైతులు వరి పంటను వెద సాగు పద్ధని పాటిస్తే ఎకరానికి రూ.8 వేలు వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చని చెప్పారు. వరి పంట వేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో బోనాల మల్లేశం, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు రవీందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.