బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ ఈడీ సంజనా షా
అమీర్పేట్, డిసెంబర్ 26: కొవిడ్ కారణంగా వ్యాపారాలు కుదేలైన సమయంలో బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ స్థాయి వ్యాపారులను అందుబాటులో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడంలో చక్కటి మార్గదర్శకంగా నిలిచిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమీర్పేట్లోని హోటల్ మ్యారీగోల్డ్లో బీఎన్ఐ సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో (1-2-1 కాన్క్లేవ్) పద్ధతిన జరిగిన అతి పెద్ద ముఖాముఖి సదస్సులో 200 మందికి పైగా ఎంటర్ప్రెన్యూర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి వ్యాపారిభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ఒకరికొకరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘గివర్స్ గెయిన్’ పద్ధతి ద్వారా ఎంఎస్ఎంఈ నిర్వాహకులంతా కలిసి చక్కటి నెట్వర్క్ను నిర్మించుకోవడం ద్వారా విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలను ఇచ్చిపుచ్చుకునే దిశగా బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్ ఈడీ సంజనా షా చక్కటి మార్గదర్శనం చేశారు. పరస్పర ప్రయోజనాలు పొందే ప్రాతిపదికన ఎంటర్ప్రెన్యూర్లు తమలోని అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను వెలికి తీస్తూ తమ డ్రీమ్ రిఫరల్స్తో పాటు అనేక ఇతర సహకార అవకాశాలను అందిపుచ్చుకున్నారని నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు డాక్టర్ మణిపవిత్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన పారిశ్రామికవేత్త ప్రదీప్ యలగడ్డ పాల్గొన్నారు.