న్యూఢిల్లీ: కాంగ్రెస్ అసంతృప్త నేతలతో కూడిన గ్రూప్ 23లో తన చాప్టర్ ముగిసిందని కపిల్ సిబల్ తెలిపారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని కాదన్నారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో రాజ్యసభకు బుధవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన, ఈ నెల 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. 31 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న తాను ఆ కుటుంబాన్ని వీడటం అంత తేలిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. పార్టీ దయ వల్ల తాను అనేక పదవులను చేపట్టినట్లు గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మనోహరమైన, దయగల వ్యక్తి అని 73 ఏళ్ల కపిల్ సిబల్ కొనియాడారు. తాను ఆమెతో ఇటీవల సమావేశమైన సంగతిని అంగీకరించారు. అయితే ఈ భేటీ వ్యక్తిగతమన్న ఆయన, తమ మధ్య జరిగిన సంభాషణను బయట పెట్టేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ పుంజుకుని జాతీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీలో చేరుతారన్న ఊహా గానాలను కపిల్ సిబల్ ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఎస్పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తాను ఏదైనా పార్టీలో చేరితే పదో షెడ్యూల్ ప్రకారం అనర్హుడవుతానని అన్నారు. అందుకే ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తన ఈ బహిరంగ ప్రకటన ఎప్పటికీ ఇదేనని స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చిన సమాజ్వాదీ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.