అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో వాతావరణ మార్పుల కారణంగా వాతావరణ మేఘావృతమై ఉంది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఓ ఎంపీటీసీ మృతి చెందారు. జిల్లాలోని ఎటపాక మండలం తోటపల్లి గ్రామ ఎంపీటీసీ శ్రీదేవి(36) పిడుగుపాటుకు మృతి చెందింది. ఇంటి ఆవరణలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఆమెపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా, జీకే వీధి మండలం సూరవరంలో పిడుగుపడి సత్యనారాయణ అనే యువకుడు మృతి చెందాడు.
నంద్యాల జిల్లా మహానంది, హాలహర్వి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత నాలుగు రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కుప్పగల్లో వర్షం కారణంగా ఇద్దరు మహిళలు చెట్టుకిందకు వెళ్లారు. ఇదే సమయంలో పిడుగు చెట్టుపై పడి ఇద్దరు మహిళలు ఉరుకుందమ్మ (33) , లక్ష్మమ్మ(39)లు మృతి చెందారు.