మహబూబ్నగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిడ్జిల్ మండల పరిషత్పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చక్రం తిప్పడంతో మండల పరిషత్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్కు ఉన్న ఒక్క ఎంపీపీ స్థానం కూడా చేజారింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత రాష్ట్రంలో ఎంపీపీగా ఎన్నికైన తొలిప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అన్ని మండలాలను క్లీన్స్వీప్ చేసింది. ఇటీవల మిడ్జిల్ ఎంపీపీగా ఉన్న కాంతమ్మ పార్టీ నాయకుల పోకడలు నచ్చక ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఎన్నిక నిర్వహించారు.
తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్న మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్కు నలుగురు, కాంగ్రెస్కు నలుగురు, ఒకరు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీటీసీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ పదవి దక్కించుకున్నారు. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత మండల పరిషత్ పీఠాన్ని ఒక ఇండిపెండెంట్, మరో కాంగ్రెస్ ఎంపీటీసీ మద్దతు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. పార్టీ బలపర్చిన ఎంపీపీని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పావులు కదిపారు. మాజీ ఎంపీపీ మద్దతునే ఎంపీపీ స్థానం కైవసం చేసుకున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గెలుపొందిన బరిగెల సుదర్శన్ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందిస్తూ సన్మాచించారు.
ఏకగ్రీవంగా సుదర్శన్ ఎన్నిక
మిడ్జిల్ మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నిక శనివారం సాఫీగా నిర్వహించారు. ఎన్నికల అధికారి మధుసూదన్ అధ్యక్షతన ఉదయం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిది మంది ఎంపీటీసీల్లో నలుగురు బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్, మరో కాంగ్రెస్ ఎంపీటీసీ హాజరయ్యారు. కోరం ఉండటంతో ఎన్నిక షెడ్యుల్డ్ను ప్రకటించారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో బీఆర్ఎస్ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా సుదర్శన్ను వేముల ఎంపీటీసీ యశోద ప్రతిపాదించగా.. కొత్తపల్లి ఎంపీటీసీ శంకరయ్య బలపర్చారు. దీంతో సుదర్శన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ బీఫాంపై ఇదే తొలి ఎన్నిక. జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంతకం చేసిన బీఫాంను అందించడంతో బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన తొలి ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. అనంతరం ఎంపీపీగా నిమమాక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు.
చక్రం తిప్పిన ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గంలో విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించి చక్రం తిప్పారు. మిడ్జిల్ మండల పరిషత్ అధ్యక్ష పదవి ఖాళీ కావడం తో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే తపనతో కాంగ్రెస్, ఇండిపెంటెండ్ ఎంపీటీసీలను తనవైపునకు తిప్పుకొని ఎంపీపీ ఎన్నికలో సునాయాసంగా గట్టెక్కించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు సరిసమాన బలం ఉండటంతో గతంలో ఇండిపెండెంట్ను తమవైపునకు తిప్పుకొని కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు అదే ఇండిపెండెంట్తో పాటు మా జీ ఎంపీపీని బీఆర్ఎస్ను బలపర్చేలా లక్ష్మారెడ్డి చక్రం తిప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసి టీపీసీ చీఫ్ రేవంత్ కంచుకోటను బద్ధలు కొట్టారు. బీఆర్ఎస్ తరఫున తొలిబీఫాంతో ఎంపీపీగా ఎన్నికైన సుదర్శన్, ఎమ్మెల్యే సహకారంతో తొలిప్రజాప్రతినిధిగా రికార్డు సాధించారు. దేశంలోనే తొలిసారిగా బీఆర్ఎస్ బీఫాంతో ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రజాప్రతినిధిని గుర్తింపు పొందాడు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎంపీపీగా ఎన్నికైన సుదర్శన్ను అభినందనలతో ముంచెత్తారు.