హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ సంస్థకు జరిమానా విధించిన అధికారులను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ బుధవారం అభినందించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్ సంస్థ ఉండగా.. దాని పరిధిలోని భూమిలో ఉన్న 65 చెట్లను సంస్థ ప్రతినిధులు గతవారం ఎలాంటి అనుమతి లేకుండా నరికి వేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, చెట్లను విచక్షణారహితంగా తొలగించినట్లు నిర్ధారించారు.
ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం రూ.4 లక్షల జరిమానా విధించారు. అలాగే తొలగించిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చెట్లను నరికివేసిన బాధ్యతులపై కఠినంగా వ్యవహరించిన అటవీశాఖ, రెవెన్యూ అధికారులను ఎంపీ అభినందించారు. తమ ఇష్టానుసారం చెట్లను నరికి తప్పించుకోవచ్చు అని భావించే వారికి ఇది హెచ్చరిక పంపుతుందంటూ ట్వీట్ చేశారు.