హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు 5.6 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు, ప్రస్తుతం 8.1 శాతానికి పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత నిర్ణయాలతో గత మూడేండ్లలో దేశంలో 25 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొన్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను నింపుతుంటే, కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉద్యోగులను ఇండ్లకు పంపుతున్నదని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై గురువారం పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చి, దానిపై చర్చ చేపట్టాలని డిమాండ్ వారు చేశారు. ఉభయ సభల్లోనూ చర్చకు నిరాకరించటంతో తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేశ్ నేతకాని, పసునూరి దయాకర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగటం మంచిది కాదని పేర్కొన్నారు.
ఉద్యోగాలు ఊడగొడుతున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా, ఉన్న ఉపాధిని కూడా ఊడగొడుతున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో 43 శాతం మందికి ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను రూ.90 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు కుదించిందని ధ్వజమెత్తారు. ఇండియన్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్ నిధులను రూ.2,950 కోట్ల నుంచి రూ. 2,400 కోట్లకు కుదించిందని ఆరోపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల ఉపాధి కల్పన కార్యక్రమాలకు కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయించి, అందులో 35 శాతం కోత విధించిందని కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ, ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు నిధులు భారీగా తగ్గించారని, పట్టణ నిరుద్యోగాన్ని అసలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్రం ఉన్న ఉద్యోగాలను పీకేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, తాజాగా 91 వేల పోస్టులు భర్తీ చేస్తున్నదని వివరించారు.
కేంద్రం అసమర్థతోనే నిరుద్యోగ ఆత్మహత్యలు
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆరోపించారు. మూడేండ్లలో 25 వేల మంది ఆత్మహత్య చేసుకొన్నారని తెలిపారు. దేశంలో 2014లో 5.6 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు, ప్రస్తుతం 8.1 శాతానికి చేరిందని తెలిపారు. దేశంలో 23 పీఎస్యూలను కేంద్రం మూసివేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ, ప్ర భుత్వ రంగ సంస్థల్లో 16 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాం డ్ చేశారు. బీజేపీని తెలంగాణ యువత తరిమికొట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం తమ పాలనాకాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ పోతుగంటి రాములు డిమాండ్ చేశారు.
నిరుద్యోగంపై చర్చకు భయపడిన కేందం
దేశంలో నిరుద్యోగ సమస్యపై గురువారం లోక్సభలో నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో కే కేశవరావు నోటీసు ఇచ్చారు. కేంద్రం పరిధిలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటి భర్తీపై కేంద్రం వివరణ ఇవ్వాలని కోరుతూ ఉభయ సభల సెక్రెటరీ జనరళ్లకు నోటీసులు అందజేశారు. సభలు ప్రారంభం కాగానే ఈ నోటీసులపై చర్చ చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై చర్చకు వెనుకడుగు వేసింది. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలను సభాధ్యక్షులు తోసిపుచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు సభల నుంచి వాకౌట్ చేశారు.