భోపాల్: మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సమ్మె చట్టవిరుద్దమని ఎంపీ హైకోర్టు తీర్పు చెప్పింది. వారు 24 గంటల్లో విధులకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా జూనియర్ డాక్టర్లు ఈ తీర్పును తిరస్కరిస్తున్నారు. ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 3000 మంది జూనియర్ డాక్టర్లు తీర్పును నిరసిస్తూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నాలుగు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను కోర్టు చట్టవిరుద్ధమైనదిగా పేర్కొన్నది. సోమవారం మొదలైన సమ్మె తమ డిమాండ్లు నెరవేరేంత వరకు కొనసాగుతుందని మధ్యప్రదేశ్ జీనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవిందర్ మీనా తెలిపారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. పలురాష్ట్రాల జూనియర్, సీనియర్ డాక్టర్లు తమ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. మే 6వ తేదీ డిమాండ్లు పరిశీలిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఏమీ జరగలేదని డాక్టర్ మీనా చెప్పారు. స్టైపెండ్ పెంచాలని, తమకు, తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకితే ఉచితంగా చికిత్స అందించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.