భోపాల్: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు వెనుక భాగం పూర్తిగా నదిలోకి జారిపోయినా.. అందులోని ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షాల కారణంగా షియోపూర్ జిల్లాలో మిథి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆ నదిపై బార్గవన్ గ్రామం వద్ద ఇటీవలే కొత్తగా నిర్మించిన ఓ బ్రిడ్జిపై నుంచి కూడా నీరు ప్రవహిస్తున్నది.
అయితే, అదే సమయంలో ఓ బస్సు కొంతమంది ప్రయాణికులతో అటుగా వచ్చింది. అయితే వరద ఉధృతిని సరిగా అంచనావేయలేకపోయిన డ్రైవర్.. బ్రిడ్జిపై నుంచి బస్సును నది దాటించే ప్రయత్నం చేశాడు. కానీ బస్సు బ్రిడ్జి మధ్యలోకి వెళ్లేసరికి వెనుక టైర్లు నదిలోకి జారిపోయి. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకున్నారు. స్థానికుల సాయంతోనే ఆ బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తీశారు.