రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కొన్నేండ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. దాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 3.28 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా వీరిలో రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నూతన ఉద్యోగ నియామకాల వల్ల ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సీపీఎస్ విధానాన్ని కేంద్రం సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ సీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. కానీ ఇందులో ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ విధానంపై 23 ఆగస్టు 2014న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ దీని పరిధిలోకి తీసుకువచ్చినట్లు అయింది. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ విరమణ సమయంలో వచ్చే 50 శాతం పెన్షన్, కుటుంబ సభ్యులకు వచ్చే 30 శాతం పెన్షన్, కనీసం రూ.16 లక్షల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను ఉద్యోగులు కోల్పోతున్నారు.
సీపీఎస్లో ఉద్యోగి, ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులను కాపాడాల్సిన సామాజిక బాధ్యత ప్రజలపై ఉంది. నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడం ప్రారంభించాయి. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నారు.
సీపీఎస్లో ఉద్యోగి బేసిక్ పే, డీఏలతో కలిపి 10 శాతం, మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం నుంచి మరో 10 శాతం సొమ్మును కలిపి నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్(ప్రాన్)లో ఈ సొమ్ము జమవుతుంది. ఉద్యోగ విరమణ పొందే నాటికి జమ అయిన మొత్తం నుంచి 60 శాతం డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40 శాతం డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారీ పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. ఒకవేళ షేర్ మార్కెట్లో నష్టాలను చవిచూస్తే ఉద్యోగి డబ్బుల నుంచి తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విచారకరం. వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతున్నది. సీపీఎస్ నష్టదాయకంగా ఉందని దాన్ని రద్దుచేసి ఓపీఎస్ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని కొన్ని రాష్ర్టాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేశాయి. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆకాంక్షలను గమనించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ఈ హామీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
-పాకాల శంకర్ గౌడ్
98483 77734