టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది. ఇందుకు తమ అల్లుడే బాధ్యుడంటూ మృతిరాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. అల్లాదుర్గం సీఐ జార్జ్ కథనం ప్రకారం.. టేక్మాల్ మండలం దాదాయిపల్లికి చెందిన కొటంగారి రాజు, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్కు చెందిన రజిత(25) ఐదేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి కొడుకు రిశ్వంత్(3), కూతురు రక్షిత(2) ఉండగా, రజిత ప్రస్తుతం గర్భిణి. రజితను పెండ్లి చేసుకోకముందే రాజుకు మరో యువతితో పెండ్లి జరిగింది. రెండో భార్య విష యం బయటపడటంతో అప్పట్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తర్వాత రాజు బతుకుదెరువు కోసం ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లి, వేర్వేరుగా కాపురం పెట్టాడు. కొవిడ్ కారణంగా రెండేండ్ల క్రితం తిరిగి స్వగ్రామానికి మకాం మార్చాడు. ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరగడంతో మంగళవారం తెల్లవారుజామున రజిత పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్యాపిల్లల కోసం వెతుకుతున్న రాజుకు చెరువులో ఇద్దరు పిల్లల శవాలు కనిపించాయి. తన పిల్లలు చెరువులో పడి చనిపోయారని, భార్య కనిపించడం లేదని స్థానికులకు సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చెరువులో వెతికి రజిత శవాన్ని వెలికి తీశారు. రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
రజితతోపాటు ఇద్దరి శవాలు చెరువులో లభించడంపై ఆమె తల్లి శాంతమ్మ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి అల్లుడు రాజు పనేనని ఆరోపించింది. గతంలో పలుమార్లు గొడవలు జరిగినా పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చామని ఆమె తెలిపింది. న్యాయం చేయాలంటూ రజిత బంధువులు ఆందోళనకు దిగారు.