కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్కర్నూలు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామానికి చెందిన అనూష(35)కు ఇద్దరు పిల్లలు ధనలక్ష్మీ(12), అక్షిత (10). భర్త ఐదేళ్ల కిందటే చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను అనూష పోషిస్తోంది. వేసవి సెలవులు కావడంతో వారిద్దరికీ నీటి గుంతలో ఈత నేర్పించేందుకు తీసుకెళ్లింది. చిన్న కూతురు అక్షిత నడుము కూల్ డ్రింక్ బాటిళ్లు కట్టి గుంతలోకి దింపింది. అయితే నీటిలోకి దిగిన తర్వాత అక్షిత ఏడవడంతో అనూష కంగారుపడిపోయింది. తన కూతురు నీటిలో మునిగిపోతుందేమో అన్న భయంతో గుంతలోకి దూకింది.
కానీ అనూషకు కూడా ఈత రాకపోవడంతో అదే నీటి గుంతలో మునిగిపోయింది. దీంతో పెద్ద కూతురు ధనలక్ష్మీ పరిగెత్తుకుంటూ వెళ్లి స్థానికంగా ఉన్న రైతులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలియగానే హడావుడిగా వచ్చిన వారు.. కూల్డ్రింక్ బాటిళ్లతో ఉన్న అక్షితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఈత రాకపోవడంతో అనూష నీట మునిగి మరణించింది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.