రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద జమయ్యే మొత్తానికి 14 శాతం మేర ట్యాక్స్ బెనిఫిట్ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్థాయి బెనిఫిట్ను కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే పొందే వీలున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 10 శాతం వరకే పన్ను బెనిఫిట్ను పొందుతున్నారిప్పుడు. అయితే గత నెల పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్లో నిబంధనల్ని సవరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ 14 శాతం పన్ను ప్రయోజనాలు లభించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ పన్ను ప్రయోజనానికి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఉద్యోగి, సంస్థల కంట్రిబ్యూషన్ల కింద ఎన్పీఎస్కు చేరే మొత్తాలకు సంబంధించి పన్ను బెనిఫిట్ను పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ.1.5 లక్షల వరకు ఎన్పీఎస్కు చేసే కంట్రిబ్యూషన్పై సెక్షన్ 80సీసీడి(1) కింద పన్ను రాయితీని పొందవచ్చు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ పన్ను రాయితీ 10 శాతం వరకే ఉన్నది.
సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఉద్యోగులు రూ.50 వేల వరకు అదనపు డిడక్షన్ పొందవచ్చు. అయితే టైర్1 ఎన్పీఎస్ అకౌంట్లలోనే ఈ అదనపు డిడక్షన్ను పొందే వీలుంది. టైర్2 ఎన్పీఎస్ ఫండ్లలో మదుపుపై ఎలాంటి పన్ను రాయితీలు లేవు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు మదుపు చేయడం ద్వారా పన్ను రాయితీని పొందవచ్చు. కానీ పాత ఆదాయపు పన్ను పద్ధతిని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ పన్ను రాయితీలు వర్తిస్తాయి.
వేతన జీవులందరూ ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్లపై సెక్షన్ 80సీసీడి(2) కింద పన్ను రాయితీలను పొందవచ్చు. ఒకవేళ ఎన్పీఎస్ అకౌంట్, ఈపీఎఫ్, సూపర్ యాన్యుయేషన్లకు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7.5 లక్షలకు మించితే మాత్రం పన్నులు వర్తిస్తాయి.