హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ) స్పష్టం చేసింది. దేశంలోని 11 మహా నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదయిందని, మిగిలిన 2 మెట్రో నగరాల్లో మాత్రం నియామకాలు గతంలో కంటే తగ్గాయని విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రకటించింది. 16% వృద్ధిరేటుతో హైదరాబాద్ తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది.
బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ రంగాల్లో నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఇనుము/ఉక్కు తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు దాదాపు 20% తగ్గినట్టు తెలిపింది. ప్రస్తుతం పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలికి ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానాన్ని ప్రారంభిస్తుండటంతో మున్ముందు ఉద్యోగ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 39% వృద్ధిరేటుతో తొలి స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి.
ముంబై 21%
కొయంబత్తూర్ 20%
హైదరాబాద్, చెన్నై 16%
బెంగళూర్ 15%
కోల్కతా 13%
ఢిల్లీ ఎన్సీఆర్ 13%
పుణె 12%
బరోడా 01%
జైపూర్ -6%
చండీగఢ్ -9%
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ 37%
ఐటీ/టెలికం 17%
తయారీ రంగం 16%
అతిథ్యం/పర్యాటకం 11%
ఇంజినీరింగ్, సిమెంట్, కన్స్ట్రక్షన్ -20%
మీడియా/ఎంటర్టైన్మెంట్ -16%
ఎఫ్ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ -13%