తిరువనంతపురం : కరోనా మహమ్మారి కేరళ వణికిపోతున్నది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో భారీగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మంకీ ఫీవర్ కలకలం సృష్టిస్తున్నది. వయనాడ్ జిల్లాకు చెందిన 24 సంవత్సరాల యువకుడికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సకీనా ధ్రువీకరించారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశామని, స్థానిక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, మనవంతవాడి మెడికల్ కాలేజీలో చేర్చగా.. వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది మంకీ ఫీవర్ తొలి కేసు నమోదవడం ఇదే తొలిసారి. మంకీ ఫీవర్ ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా సోకుతుందని నిపుణులు పేర్కొన్నారు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి డెంగీ లక్షణాలు ఉంటాయని, 5-10శాతం మరణాలు సంభవిస్తాయని తెలిపారు.