హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను అనివార్యంగా సవరించాల్సిన అవసరం కనిపిస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్తుశాఖలో నెలకొన్న పరిస్థితులు, వ్యవసాయంతోపాటు పరిశ్రమలకు, గృహ వినియోగదారులకు చేస్తున్న నిరంతర విద్యుత్తు సరఫరాపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు ఇటీవల విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్కు సమర్పించిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలు, విద్యుత్తు పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య కొనసాగుతున్న లోటును పూడ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, పీక్ డిమాండ్, తలసరి వినిమయం గణనీయంగా పెరిగిన విషయాన్ని అధికారులు గణాంకాలతో సహా వివరించారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించి ట్రాన్స్కో, డిసంలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని అధిగమించి విద్యుత్తు సంస్థలు మనుగడ కొనసాగించాలంటే చార్జీలను సవరించక తప్పదని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వ ఇంధన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్రావు తదితరుల అభిప్రాయాలను తెలుసుకొన్నారు. లోటును పూడ్చేందుకు విద్యుత్తు చార్జీల సవరణ తప్పదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవడంతో తుది నిర్ణయం తీసుకొనేందుకు మరోసారి భేటీకావాలని నిర్ణయించారు.