కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు.
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అన్నట్టుగా ఉన్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలనలో సగటు మనిషి జీవితం. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ర్టాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సామాన్యుల ఉసురు తీస్తున్నది. పాణం బాగలేక దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి. దవాఖాన బెడ్డు దగ్గర్నుంచి శ్మశానంలో కాటిదాకా జీఎస్టీ వర్తిస్తున్నది మరి. పాలు, పెరుగు, పెన్సిళ్లు ఇలా చెప్పుకొంటూపోతే కాదేదీ జీఎస్టీకి అనర్హం అనాల్సిందే. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్నింటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండటం కలవరపెడుతున్నది. జాతి ప్రయోజనాల కోసమే జీఎస్టీని తెచ్చామని బీజేపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఈ గలత్ సర్కార్ ట్యాక్స్కు ముందు 50 శాతాన్ని మించి ఆయా వస్తు ఉత్పత్తులు పన్ను పరిధిలో లేకపోవడం గమనార్హం.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఉదయం నిద్రలేచినప్పట్నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతీదానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నది. ఫలితంగా ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా పరిణమించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గడిచిన ఎనిమిదేండ్లుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు.. దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా, పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు.
పాలనూ వదల్లేదు…
సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్టు ఐదేండ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటివాటన్నింటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. కానీ.. దేన్నీ వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్మిల్ వంటి ప్రీప్యాక్డ్, ప్రీలేబుల్డ్ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వేశారు. అంతేగాక డెయిరీ మిలింగ్ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్మిల్ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ పాడి పరిశ్రమ. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25 శాతం డెయిరీ నుంచే వస్తున్నది. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా.. ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్దపెద్ద సంస్థలు మాత్రమే నిలబడుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలూ అంటున్నారు.
సామాన్యుడిపై మోయలేని భారం
సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తున్నది. దీంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్నది. కిలో పెరుగు ధరే 3-4 రూపాయలు పెరిగింది. ఇక లెదర్ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండాపోతున్నది. రైతు ప్రభుత్వమని చెప్పుకునే మోదీ.. అన్నదాతలనూ కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకూ పన్నుపోటు పడింది మరి. అసలే కొవిడ్తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో రూ.1,000 వరకూ ఉన్న రూమ్లపై 12 శాతం పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లు, ఫోర్కులపైనా పన్నేశారు. చివరికి స్కూల్ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్ప్నర్లు వంటి వాటిపైనా జీఎస్టీ వచ్చిపడింది.
కార్పొరేట్ల కోసమే..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా.. పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నాయి. ఒకప్పటితో పోల్చితే కొనుగోలుశక్తి చాలావరకూ తగ్గిపోయింది. నిజానికి బ్రాండెడ్ నిత్యావసరాలు మార్కెట్లో అధిక ధరలుంటాయి. ప్యాక్ చేసిన వస్తువులే నాణ్యతగా ఉంటాయని కేంద్రం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. మొదట ప్యాకింగ్ విధానాన్ని బాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్నుంచి కిరాణా షాపుల్లో సైతం ప్యాకింగ్ చేసి అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం ప్యాకింగ్ చేసిన నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించారు. ఫలితంగా వ్యాపారులు ఇక ప్యాకింగ్ చెయ్యరు. ప్రజలు కార్పొరేట్ దుకాణాల్లోని ప్యాకింగ్ చేసిన వాటినే కొనుగోలు చేస్తారు. దీనివల్ల చిరు వ్యాపారులు నలిగిపోయే అవకాశమున్నది. సామాన్యుడు ధరలతో విలవిల్లాడే ప్రమాదమున్నది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో నిత్యావసరాలు అమాంతం పెరిగిపోయాయి. పేదరికం పెరిగిపోయిందని సూచీలన్నీ చెప్తున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటొద్దనేది రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం. కానీ ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉన్నది. ఇవే విధానాలు కొనసాగితే దేశం.. శ్రీలంకగా మారే ప్రమాదమున్నది.
-డీ పాపారావు, ఆర్థిక రంగ నిపుణులు
చర్చల్లో రాష్ర్టాల పాత్ర నామమాత్రమే..
వస్తువులపై జీఎస్టీ విధింపుపట్ల కౌన్సిల్ తీసుకునే నిర్ణయమే ఆఖరు అంటూ ఊదరకొడుతున్న నరేంద్ర మోదీ సర్కారు.. ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికి జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రంగానే ఉంటుందని ఈ సమావేశంలో పాల్గొన్న ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కేవలం గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆమోదం పొందడానికి మాత్రమే జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలను రాష్ర్టాలు ఆమోదించాల్సిందే.
అన్ని రాష్ర్టాల ఆమోదంతోనే..
నిత్యావసరాలపై జీఎస్టీపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ర్టాల ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అంటున్నారు. గోధుమ పిండి, ఇతరత్రా ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి జీఎస్టీ మండలి సమావేశంలో బీజేపీయేతర పాలిత రాష్ర్టాలన్నీ ఇందుకు అంగీకరించాయని నిర్మల చెప్పారు. పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ర్టాలూ మండలిలో ఉన్నట్టు తెలియజేశారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిత్యావసరాలపై జీఎస్టీ బాదుడును విపక్షాలన్నీ ఎండగడుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజానికి జీఎస్టీ విధానం కంటే ముందు వీటన్నిటిపై ఆయా రాష్ర్టాలు అమ్మకపు పన్ను లేదా వ్యాట్ వేశాయని గుర్తుచేశారు.
ఇంటి అద్దెలపైనా పన్ను
పాలు, పెరుగు, పప్పులు..ఇలా ఇంట్లో వాడే అన్నింటిపై పన్ను విధించిన కొత్త జీఎస్టీ నిబంధనలు..చివరకు అద్దెకిచ్చే ఇంటిని కూడా వదల్లేదు. రెసిడెన్షియల్ అద్దెలపై 18 శాతం జీఎస్టీని కేంద్ర రెవిన్యూ శాఖ తాజాగా ప్రవేశపెట్టింది. దీని అమలు జూలై 18 నుంచి మొదలైంది. అయితే ఇంటిని కిరాయికి తీసుకునే అందరికీ ఇది వర్తించదు. జీఎస్టీ కింద రిజిష్టరైన వ్యక్తికి ఇచ్చే ఇంటి అద్దెపై 18 శాతం పన్ను పడుతుంది. దీనిని అద్దెకు తీసుకునేవారే చెల్లించాలి. రూ.20 లక్షలకుపైగా సేవల టర్నోవర్, రూ. 40 లక్షలకు మించిన ఉత్పత్తుల టర్నోవర్ కలిగిన ఏ వ్యక్తి అయినా జీఎస్టీ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రెసిడెన్షియల్ ప్రాపర్టీని గెస్ట్ హౌస్ కోసం, ఉద్యోగులు, డైరెక్టర్లకు వసతి కల్పించడానికి అద్దెకు తీసుకుంటే ఆ చెల్లింపుపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీ కింద రిజిష్టర్ అయిన వ్యక్తి తన రెసిడెన్షియల్ ప్రాపర్టీని బిజినెస్ అవసరాల కోసం కాకుండా వ్యక్తిగత వినియోగానికి అద్దెకిచ్చినా జీఎస్టీని చెల్లించాలి. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినపుడు కేవలం కమర్షియల్ ప్రాపర్టీని పన్ను పరిధిలోకి చేర్చి, రెసిడెన్షియల్ ప్రాపర్టీని మినహాయించారు. ఈ నిబంధన ఇండ్ల కొనుగోలుదార్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తుందని నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ హితేశ్ థక్కర్ అన్నారు.
జీఎస్టీ.. అయోమయం.. అస్పష్టత..
జీఎస్టీని తీసుకొచ్చిన ఐదేండ్లలో వెయ్యి సవరణలు చేశారు. నాటి నుంచి ట్యాక్స్ క్రెడిట్ ఆలస్యమే అవుతున్నది. అవసరమైన పత్రాల సమర్పణ సుదీర్ఘ ప్రక్రియగా మారడమేకాదు.. సాంకేతిక అంతరాయాలూ ఎదురవుతున్నాయి. 84శాతం పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పత్రాలను సవ్యంగా సమర్పించలేకపోతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ల (ఐటీసీ)ను క్లెయిము చేయడమూ సమస్యగా ఉన్నది. చాలామంది పన్ను చెల్లింపుదారులు నష్టపోయారు. నిబంధనల్లోని అస్పష్టతలవల్ల కోర్టు వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి కేంద్రం సెస్సుల రూపంలో గణనీయంగా పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకొంటోంది. తమకు పరిహారం చెల్లింపు గడువును మరికొంతకాలం పొడిగించాలనీ రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి.
పరోటాలు..రోటీలు కాదట
ఎప్పటికప్పుడు మారుస్తూపోతున్న జీఎస్టీ నిబంధనలూ వినియోగదారుల్ని గందరగోళ పరుస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులూ జారీచేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్లు రూలింగ్స్ ఇస్తున్నాయి. రోటీలు, చపాతీలపై జీఎస్టీ 5 శాతంగా, పరోటాలపై 18 శాతమని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) కర్నాటక బెంచ్ రూలింగ్నిచ్చింది. రెడీ కుక్ ఉత్పత్తుల్ని విక్రయించే ఐడీ ఫ్రెష్ ఫుడ్స్…పరోటాలపై వర్తించే జీఎస్టీ రేటుపై ఏఏఆర్ను ఆశ్రయించగా ఈ రూలింగ్ వచ్చింది.
కేంద్రం విధించిన కొన్న పన్నులపై సోషల్ మీడియాలో నెటిజెన్ల రియాక్షన్