న్యూఢిల్లీ, మార్చి 20: రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతి సూక్తులు చెప్తూ సవాలక్ష కొర్రీలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాను మాత్రం ఆ సుద్దులను పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నది. ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.155.8 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏకంగా 57.3 శాతానికి సమానమని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించింది.
ఇందులో విదేశీ రుణాలు రూ.7.03 లక్షల కోట్ల (జీడీపీలో 2.6 శాతం) వరకు ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పుల్లో విదేశీ రుణాలు కేవలం 4.5 శాతమేనని, ఇవి జీడీపీలో 3 శాతం కంటే తక్కువేనని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
మరో శ్రీలంక అవుతుందేమో?: నామా
మోదీ సర్కార్ చేసిన అప్పులతో దేశం ఎటుపోతుందోనని బీఆర్ఎస్ ఎంపీ నామా ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం అప్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నదని మండిపడ్డారు. మోదీ చేసిన అప్పులతో ఇండియా మరో శ్రీలంక అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.