నమస్తే తెలంగాణ: మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానికీ దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి దించేస్తున్నది. ‘అప్పుల భారతం’గా మార్చేస్తున్నది. 2014 మార్చి 31 నాటికి దేశ అప్పులు రూ.55.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి అవి రూ.152.17 లక్షల కోట్లకు పెరగనున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. అంటే గత తొమ్మిదేండ్లలో కేంద్రం ఏకంగా రూ.96 లక్షల కోట్ల అప్పు చేసింది.
65 ఏండ్లలో దేశం చేసిన అప్పులతో పోల్చితే మోదీ సర్కార్ కేవలం 9 సంవత్సరాల్లోనే రెట్టింపు అప్పులు చేసింది. తద్వారా దేశంలోని ప్రతి పౌరుని తలసరి అప్పును రెట్టింపు కంటే ఎక్కువకు పెంచింది. 2014 నాటికి దేశ జనాభా దాదాపు 129 కోట్లు. ఈ లెక్కన అప్పుడు తలసరి అప్పు సుమారు రూ.4.34 లక్షలు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరినట్టు భావించినా.. ప్రతి పౌరునిపై రూ.11 లక్షల రుణభారం ఉన్నట్టే. దీంతో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ దారుణంగా చతికిలబడినట్టు స్పష్టమవుతున్నది. ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం.. దేశ అప్పులను మూడింతలు, తలసరి అప్పును రెండున్నర రెట్లు పెంచి ‘ట్రిపుల్ ఫెయిల్యూర్ సర్కార్’గా చరిత్రకెక్కింది.