(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి పశువుల కారణంగా రైతన్నలు వేలాది ఎకరాల్లో పంటలను నష్టపోతున్నారన్నది నాకు తెలుసు. దానికి పరిష్కారాన్ని ఎప్పుడో కనుగొన్నా. మార్చి 10న ఫలితాలు రానీయండి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే, చిటికెలో సమస్యను పరిష్కరిస్తాం’ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ ఇది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 8 నెలలు గడిచింది. అయినప్పటికీ, రైతులకు పశువుల బెడద ఇంకా తొలగిపోలేదు. దీంతో అన్నదాతల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
రాత్రిళ్లు కాపలా..
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. యూపీలో 18.4 లక్షల గోవులు ఉన్నాయి. అయితే, 8.55లక్షల గోవులకోసమే ప్రభుత్వం 6,222 షెల్టర్లను నిర్మించింది. దీంతో మిగతా 10 లక్షల గోవులు వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. పశువులదాడిలో ఆలుగడ్డ, గోధుమ, కూరగాయలు, బార్లీ వంటి పంటలు వేలాది ఎకరాల్లో పాడవుతున్నాయని, దీంతో లక్షల రూపాయలు నష్టపోతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు మహిళలను ఇండ్లల్లోనే ఉంచి పొలాల్లో కాపలాకాయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గోశాలలు నిర్మించి పశువులను తరలిస్తానన్న ప్రభుత్వం మాటతప్పిందని మండిపడుతున్నారు. గుజరాత్లోనూ గోశాలల అంశంలో బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది.
మాటల ప్రధాని.. మోదీ
ప్రధాని మోదీ హామీనిచ్చినా సమస్య పరిష్కారమవ్వలేదు. ఆయన మాటలకే ప్రధాని. చేతల్లో ఏమీ ఉండదు. గోశాలలు నిర్మిస్తామంటూ వేలాది కోట్లను కేటాయించారు. అయితే, క్షేత్రస్థాయిలో అవేమీ జరుగలేదు. ఆకలితో గోవులు అలమటిస్తున్నాయి. ఆ డబ్బేదో రైతులకు ఇస్తే, గోశాలలు నిర్మించి పశువులను పోషిస్తారుగా.
-బీకేయూ నేత రాకేశ్ టికాయిత్
ఆత్మహత్యే శరణ్యం
ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న రైతులందరూ ఆత్మహత్య చేసుకొంటారు.
-రామాశ్రేయ్, బలియా రైతు