ఇరవై మూడేండ్ల కిందట, అప్పటి వాజపేయి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలనుకున్నది.అందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని ‘మాడ్రన్
ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఎఫ్ఐఎల్)’ ‘హిందుస్థాన్ లీవర్’అనే ప్రైవేట్ బహుళజాతి కంపెనీకి విక్రయించాలని నిర్ణయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఏడేండ్ల పాటు సుదీర్ఘమైన పోరాటాలు చేశారు. దాదాపు రెండేండ్లపాటు ఫ్యాక్టరీ గేటు వద్ద ధర్నా కూడా చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ‘మోడ్రన్ ఫుడ్స్’ను బహుళజాతి సంస్థ చేజిక్కించుకున్నది.
మాడ్రన్ ఫుడ్స్ పోరాటం విఫలమైనప్పటికీ ఈ ఉద్యమం ఇతర కార్మిక ఉద్యమాలకు మార్గనిర్దేశం చేసింది. మరొక లక్ష్య సంస్థ అయిన బాల్కో (భారత్ అల్యూమినియం కంపెనీ) కార్మికులతో పాటు వివిధ విద్యుత్ బోర్డు కార్మిక సంఘాలకు స్ఫూర్తినిచ్చింది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో వాజపేయి ప్రభుత్వం 2002 అక్టోబర్లో ప్రైవేటీకరణ పరిణామాలను పరిశోధించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 2004, సెప్టెంబర్లో ప్రత్యేక కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే సమయానికి, ఎన్డీయే ప్రభుత్వం పోయి యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఈ నివేదికను పార్లమెంట్ ముందుంచి చర్చించాలని కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది. అయితే నాటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ డిమాండ్ను పట్టించుకోలేదు. మాడ్రన్ ఫుడ్స్ను అమ్మకానికి పెట్టినప్పుడు ‘రొట్టెలు తయారుచేయడం ప్రభుత్వ వ్యాపారం కాదు’ అని కేంద్రం పేర్కొన్నది.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడ్తున్నది. ‘వ్యాపారంలో ఉండటం ప్రభుత్వ పని కాదు’ అని ప్రకటించింది. మాడ్రన్ ఫుడ్స్ నష్టాల్లో ఉన్నదని పేర్కొంటూనే అమ్మకాన్ని సమర్థించడానికి మీడియా ప్రయత్నించింది. ఈ సమర్థన ఎయిర్ ఇండియా ఇటీవలి విక్రయంలో కూడా ఉపయోగపడింది. ఈ సందర్భంగా రెండు అంశాలు పరిశీలించాలి. ముందుగా, పెట్టుబడిదారులు నష్టాల్లో నడిచే దేన్నయినా కొనుగోలు చేస్తారా? పెట్టుబడిదారుడి ఏకైక లక్ష్యం తన లాభాలను పెంచుకోవడమే. అంటే అమ్మకాలను సమర్థించడం కోసం సంస్థను ఉద్దేశపూర్వకంగా నష్టపోయేలా మార్చారని అర్థం. ఇందుకు ఉదాహరణకు ఎయిర్ ఇండియా. విలువైన భూములతో సహా అన్ని ఆస్తులను తక్కువ ధరకు సంపాదించడంపై పెట్టుబడిదారుడికి ఆసక్తి ఉంటుంది. మాడ్రన్ ఫుడ్స్ కంపెనీ మొత్తం స్థిర, చర ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు. కానీ హిందూస్థాన్ లీవర్కు కేవలం రూ.124 కోట్లకు అమ్మివేశారు.
ప్రభుత్వం పన్నులు వసూలు చేసే అధికారం కలిగి ఉన్నది. ప్రజలకు శ్రేయ స్సు, భద్రతను కల్పించే బాధ్యతనూ కలిగి ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు దేశాన్ని పాలించాయి. అయితే ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమిటీ? ఏ ప్రభుత్వాలైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో చూపిస్తున్న ఆసక్తి ప్రజల సంక్షేమం విషయంలో చూపడం లేదు. అంతేకాదు బడా కార్పొరేట్లకు మేలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. వారికి లెక్కలేనన్ని ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. వారి రుణాలను మాఫీ చేస్తున్నాయి. మాడ్రన్ ఫుడ్స్ ఇతర ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం మనకు ఒక అనుభవాన్ని బోధిస్తున్నది. ఏదైనా ఒక సంస్థను ప్రభుత్వం అమ్మాలనుకుంటే దాన్ని నష్టాల పాలు చేయడం ఆ పేరుతో అమ్మకానికి పూనుకోవడం.
75 ఏండ్ల స్వతంత్ర భారతం నేడు ఆకలిగొన్న దేశంగా అత్యంత పేద దేశాల సరసన చేరింది. మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి గణనలో, భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటిలో అడుగున ఉన్నది. అంటే ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నదో అర్థమవుతున్నది. ప్రజల కనీస అవసరాలైన ఆహారం, నీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, విద్యుత్, రవాణా మొదలైనవాటిని సమకూర్చడం ప్రభుత్వ కర్తవ్యం. ఈ బాధ్యతను గుర్తించకుండా ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడితే ప్రజలు సహించరు.
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752