ఆకాశంలో సగం. కానీ, ఆమెకు చట్టసభల్లో ఆవగింజంత ప్రాతినిధ్యం. ఇదీ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టసభల్లో తమకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అబల పోరాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా చట్టాల రూపకల్పనలో సగటున 26 శాతం మంది మహిళలు భాగస్వామ్యం అవుతుంటే మన దేశంలో 15.1కి మాత్రమే పరిమితమైంది.
దేశాన్ని ఇప్పటిదాకా పాలించిన పార్టీలేవీ మహిళా రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన దాఖలాలు లేవనే చరిత్ర చెప్తున్నది. 1996లో ప్రధాని దేవేగౌడ అధికారంలో ఉన్నపుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ మెట్లు ఎక్కింది. 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద మోక్షం కలిగింది. కానీ లోక్సభలో మాత్రం వీగిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న ప్రతీ పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం పోరాటం చేసే సంస్థలు, కార్యకర్తలు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం గళమెత్తుతూనే ఉన్నారు. అయితే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎవరి రాష్ర్టాల్లో వారే ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఆ పోరాటానికి జంతర్మంతర్ వేదికైంది.
తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటానికి చైతన్యశీలమైన పాత్రను పోషించిన ‘తెలంగాణ జాగృతి’ ‘భారత జాగృతి’గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ జంతర్మంతర్ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 10న ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ సాధన కోసం ధర్నా చేపట్టారు.
ఇట్లా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు బలమైన నేప థ్యం ఉన్నది. ఆడబిడ్డలను అందలం ఎక్కించటంలో, అబలను సబలగా స్వీకరించటంలో తెలంగాణకు ప్రత్యేక చరిత్ర, వారసత్వం ఉన్న ది. దక్షిణ భారతదేశాన్ని ఆ మాటకు వస్తే యావ త్ దేశాన్ని ప్రభావితం చేసిన కాకతీయ సామ్రాజ్యాన్ని అవిశ్రాంతంగా, అప్రతిహతంగా పాలించిన రుద్రమదేవి చారిత్రక వారసత్వం, ధిక్కార స్వరానికి దిక్సూచిగా భావించే ‘సమ్మక్క-సారలమ్మ’ పోరాట నేపథ్యం తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా మారిన చరిత్ర తెలంగాణది.
ఈ చైతన్యం, స్పృహ కలిగిన పాలన తెలంగాణలో సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లల్లోనే (2014లో) చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతిపత్రమూ ఇచ్చారు. దేశంలో మహిళా సాధికారత, స్వయం సమృద్ధి విషయంలో తెలంగాణది ప్రత్యేక ముద్ర. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, బలమైన తెలంగాణ మానవ నిర్మాణం కోసం ఆరోగ్యలక్ష్మి, సంతులిత ఆరోగ్యానికి దోహదపడే కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ వంటి పథకాలే కాకుండా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. ఇలా దేశవ్యాప్తంగా 21 రాష్ర్టాల్లో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. 1992లో 72వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం, 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. దేశంలో ప్రస్తుతం 21 రాష్ర్టాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నా యి. బీజేపీ పాలిత యూపీలో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషనే కొనసాగుతున్నది.
రాజకీయాల్లో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలని బలమైన వాదన వినిపిస్తున్నవారికి గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని చూస్తే ఆందోళన కలుగకమానదు. గుజరాత్ 182 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 8 శాతం మహిళా ఎమ్మెల్యేలున్నారు. హిమాచల్ప్రదేశ్లో మరీ దారుణం. అక్కడ ప్రతి రెండవ ఓటరు స్త్రీ. ఆ రాష్ట్రంలో 68 స్థానాలుంటే 67 మంది పురుషులు ఎమ్మెల్యేలుగా ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే మహిళ.
భారత్లో 1952లో మొదటి లోక్సభలో 24 మంది మహిళా ఎంపీలుండగా ప్రస్తుతం 82 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేయాలనే బిల్లుకు ఆమోదం పొందితే లోక్సభలో 180 మంది మహిళలు అడుగుపెట్టే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడున్న కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది బీజేపీ గత చరిత్ర చూస్తే అనుమానమేననే వాదన వినిపిస్తున్నది. 2014, 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని దేశప్రజలకు వాగ్దానం చేసింది. ఆ తర్వాత ఏమైందన్నది కళ్లముందటి చరిత్ర. విభజన చట్టంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనట్టే తన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉంటుందని అనుకోలేమనే అభిప్రాయం నెలకొన్నది. అయితే 2024 తర్వాతే 1996లో దేవేగౌడ చేసిన సాహసం చేసే అవకాశం మరోరూపంలో ఉంటుందా? ఆ తీవ్రతను… ఒత్తిడిని గమనించి కేంద్రం దిద్దుబాటు చర్య తీసుకుంటుందా? అన్న ది వేచి చూడాలి.
-నూర శ్రీనివాస్
91827 77011