Karuppu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) బాక్సాఫీస్ వద్ద విజయపరంపర కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందనతో ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. విడుదలైన వారం రోజుల్లోనే ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి.గత తొమ్మిది నెలలుగా తమిళనాడులో ఏ సినిమా అందుకోలేని అరుదైన ఘనతను ‘కరుప్పు’ సాధించింది. కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే రూ.100 కోట్ల మార్క్ను దాటిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. తొలి వారంలో దేశీయంగా నెట్ కలెక్షన్లు రూ.113 కోట్లకు పైగా నమోదైనట్లు సమాచారం. ఎనిమిది రోజులకు ఈ సంఖ్య మరింత పెరిగింది. విదేశీ మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తమిళ వెర్షన్ నుంచే అధిక ఆదాయం వచ్చినప్పటికీ, తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ విజయంతో ‘కరుప్పు’ సూర్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ ఏడాదిలో అత్యంత విజయవంతమైన తమిళ చిత్రాల్లో కూడా స్థానం సంపాదించుకుంది.
దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రానికి దైవిక నేపథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రామ దేవత అయిన ‘వెట్టై కరుప్పు’ ఆధారంగా రూపొందించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక తండ్రి, కూతురికి న్యాయం చేయడానికి దేవుడు మానవ రూపంలో భూమిపైకి వచ్చే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. సూర్య, త్రిషతో పాటు ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, అనఘా మాయా రవి, నట్టి సుబ్రమణ్యం, శ్వాసిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ‘కరుప్పు’ విజయంతో సూర్య అభిమానులు ఆనందంలో మునిగిపోతుండగా, ఈ సినిమా మరిన్ని రికార్డులను అందుకునే అవకాశాలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.