Heat wave : దేశంలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రానున్న వారం రోజులపాటు కూడా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా వాయవ్య, మధ్య, తూర్పు భారత్లోని పలు మైదాన ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని అంచనావేసింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. విదర్భ, ఆంధ్రాలోని తీరప్రాంతం, యానాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోనూ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. శుక్రవారం ఉదయం దాదాపు 11 గంటల సమయానికి నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం.. ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలన్నీ భారత్లోనే ఉన్నాయి. ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ ఈ గణాంకాలను వెల్లడించింది.
జాబితాలోని సగం నగరాలు ఉత్తరప్రదేశ్లోనివే కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలూ ఇందులో ఉన్నాయి.