MLC Kavitha | పెద్దపల్లి: రైతులపై కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతుల కోసం అహర్నిశలు ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు. మతకల్లోలాలు లేని పాలన సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్క మతకల్లోలం లేకుండా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ పరిపాలించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం ఎప్పుడూ మతకల్లోలాలతో సతమతమయ్యేదని, సీఎం కేసీఆర్ శాంతి భద్రతల సమస్య లేకుండా చేశారన్నారు. ప్రతి ఒక్కరి రక్షణకు సీఎం కేసీఆర్ పాటుపడ్డారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు రూ. 5 వేలకు పెరుగుతాయని అన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పెన్షన్ రూ. 3 వేలకు పెరుగుతుందని, ఆ తర్వాత ఏటేటా పెరుగుతూ ఐదేళ్లకు రూ. 5 వేలకు చేరుతుందని వివరించారు. కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దాంతో కోటి కార్డులకు చేరుతాయన్నారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ రక్ష పేరిట రూ. 5 లక్షల బీమా సౌకర్యం కలిగిస్తామని, సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 15 లక్షల వరకు ఉచితంగా చికిత్స చేయించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతు బంధు మొత్తం పెంపు గురించి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. అగ్రవర్ణ పేదల కోసం గురుకుల హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో కరెంటు ఉండకపోయేదని, ఇప్పుడు 24 గంటల పాటు కరెంట్ ఉంటోందని అన్నారు.
పోలింగ్ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్లే ముందు లైట్ వేయాలని, ఒకవేళ బుగ్గ వెలిగితే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉప్పు, పప్పు, మంచినూనె వంటి నిత్యవసర ధరలన్నీ పెరిగాయని, గ్యాస్ సిలిండర్ పేదల పాలిట గుదిబండగా మారిందని విమర్శించారు. రూ. 1200గా ఉన్న సిలిండర్ ధరను సబ్సిడీ కింద రూ. 400కే ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రూ. 2 వేల పెన్షన్ ఇస్తే అందులో సిలిండర్ పేరిట ప్రధాని మోదీ రూ. 1200 తీసుకుంటున్నారని, అందుకోసం ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సిలిండర్ ధరను తగ్గించి పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నారని వివరించారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అంటే పైసలు ఇచ్చేటివి పెంచుడూ, సిలిండర్ ధర తగ్గించుడు అని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కావాలని ఎవరూ అడగలేదని, అయినా కూడా పెద్దపల్లిని సీఎం కేసీఆర్ జిల్లా చేశారని పేర్కొన్నారు. దాని వల్ల మెడికల్ కాలేజీ రావడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలిగాయని చెప్పారు.