అమీర్పేట, జూలై 9 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాముఖ్యత నివ్వాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం అమీర్పేలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ స్మారకార్థం బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీ వరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి విద్యార్థులను ఉత్తేజ పరిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు క్రీడల పట్ల కూడా కొంత సమయం కేటాయించడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఏ క్రీడలపట్ల ఆసక్తి ఉందో గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తమ ప్రతిభను చాటేందుకు ఇలాంటి క్రీడాపోటీలను వేదికలుగా మార్చుకోవాలని చెప్పారు. గడిచిన 9 సంవత్సరాల నుండి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న సచిన్, అతని బృందాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి ఇంటర్ కాలేజ్ లెవెల్ లో జరిగే ఈ పోటీలలో సుమారు 100 టీమ్ లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, శ్రీనివాస్ గౌడ్, బాబా గౌడ్, ప్రకాష్ గౌడ్, సచిన్, రాహుల్, పరమేష్, అబ్రహం, రాకేష్, అర్జున్ తదితరులు ఉన్నారు.