హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మహిళల గౌరవం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శాసనసభలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల సంక్షేమపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా మాట్లాడారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని రోడ్లపై వెళ్లే దుస్థితిని సీఎం కేసీఆర్ రూపుమాపారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నారని తెలిపారు. దీంతో ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలు పోయాయని చెప్పారు. ఏ రాష్ర్టంలో ఇవ్వని విధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు పెన్షన్లు అందించడం గొప్ప విషయమన్నారు.
గత ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను శ్రమను దోచుకున్నాయి. కానీ సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచారు. ఈ సెంటర్ల ద్వారా గర్భిణీ స్ర్తీలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా అంగన్వాడీ సెంటర్లకు పాలను సరఫరా చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలను కేటాయించాలని కోరారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ ఆశా వర్కర్లను ఆరోగ్య కార్యకర్తలుగా గుర్తించి.. జీతాలు పెంచామని తెలిపారు. ఆశా వర్కర్లు కరోనా కాలంలోనూ విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. గర్భిణి స్ర్తీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు హెల్త్ హైజెనిక్ కిట్స్ ఇస్తున్నామని చెప్పారు.
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. స్ర్తీ నిధి కింద అనేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకు మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నామని చెప్పారు. దీపం పథకం కింద 20 లక్షల కనెక్షన్లు అందించడం జరిగిందన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం రూ. 3 వేల చొప్పున దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు ఇస్తుందన్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు దివ్యాంగులకు లోన్లు ఇవ్వాలని, ట్రై మోపెడ్ వాహనాలను సమకూర్చాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు.