మహాయాగంలో పాల్గొనడం అదృష్టం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, డిసెంబర్ 29 : మెదక్ పట్టణంలోని పసుపులేటి ఒడ్డున వెలసిన రేణుకామాత ఆలయ ప్రాంగణంలో రుద్రస్వాహ పూర్వక శత చండీ మహాయాగం బుధవారం పూర్ణహుతితో ముగిసింది. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామివారి పర్యవేక్షణలో మూడు రోజులపాటు మహాయాగం కొనసాగింది. ఈ సందర్భంగా రుద్ర, చండీ పారాయణాలు, హవనము, పూర్ణాహుతి, శేయస్పంపాదనము, రుత్విక్ సమ్మానము, బ్రాహ్మణ, కన్య, సుహాసిని పూజలు నిర్వహించారు. రంగంపేట ఆశ్రమ విద్యార్థులు, ఇతర వైదికులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహాయాగంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్య ప్రభాకర్శర్మ, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వేదవ్యాస్, సంఘం ప్రతినిధులు వైద్య శ్రీనివాస్శర్మ, లింగమూర్తి, రాజు పంతులు, శ్రీనివాస్శర్మ, శ్రీవాండ్ల సాయిబాబా, శ్రీవాండ్ల కృష్ణమూర్తి, శ్రీవాండ్ల శ్రీనివాస్, దేవాయిపేట లింగమూర్తి, పండిత్రావు, జనార్దన్రావు, శంకర్శర్మ, ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్గౌడ్, మాజీ అధ్యక్షడు జనార్దన్గౌడ్ పాల్గొన్నారు.
మహాయాగంలో పాల్గొనడం అదృష్టం..
శత చండీ మహాయాగంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. మాధవానంద సరస్వతీ స్వామివారి పర్యవేక్షణలో ఇలాంటి యాగాలు చేయడం శుభసూచకం అన్నారు. అందరి ఆశీర్వాదంతో మెదక్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.