యాదాద్రి, నవంబర్ 26: ఇరవై రెండేండ్ల క్రితం యాదాద్రి లక్ష్మీనరసింహుడికి కానుక ఇవ్వాలని మొక్కుకున్నానని, సీఎం కేసీఆర్ పిలుపుతో నాటి కల నెరవేరిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. యాదాద్రీశుడి విమానగోపురం స్వర్ణ తాపడానికి రెండు కిలోల బంగారాన్ని శుక్రవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సమర్పించారు. స్వామివారి బాలాలయ ముఖమండపంలో 100 గ్రాముల బరువు గల 20 బంగారు బిస్కెట్లను ఈవో ఎన్ గీతకు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మొదట కిలో బంగారం ఇస్తానని సీఎం కేసీఆర్కు చెప్పానని, కానీ ఆలయ పునర్నిర్మాణ పనులు చూసి మురిసిపోయి అదనంగా మరో కిలో ఇచ్చినట్టు ఎమ్మెల్యే మర్రి తెలిపారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మరో కిలో బంగారాన్ని స్వామి వారికి సమర్పించనున్నట్టు చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీలో తమ సంస్థ జేసీ బ్రదర్స్ తరఫున రూ.2 కోట్లతో కాటేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు.