గద్వాల: కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంపై ధర్నకు దిగారు. పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి బరాజ్పై భైటాయించి నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్తే భవిష్యత్లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గద్వాల నియోజకవర్గంలోని చెరువులు ఎండిపోవడంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి.. పాలమురును ఎడారిగా మార్చబోతున్నాడని ఆరోపించారు. దీనిని అడ్డుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే రైతుల పక్షాన నిలబడి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజలాల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.