పీసీసీ పదవి కొనుక్కున్న 420
పోటు మొనగాడైతే 2018లో ఎందుకు ఓడాడు?
సీఎంను విమర్శించే స్థాయి ఉందా?
కాంగ్రెస్ వల్లే చక్కెర పరిశ్రమ మూత
నియోజకవర్గం కోసమే టీఆర్ఎస్లోకి
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, జోకర్, దొంగ, 420 అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పిచ్చికుకలా మొరుగుతున్నారని, పీసీసీ పదవిని కొనుక్కున్న దొంగ అని ధ్వజమెత్తారు. ఆయన లాంటి 420 వల్ల కాంగ్రెస్ ఇజ్జత్ పోతున్నదని ఆ పార్టీ నాయకులే అంటున్నారని ఆరోపించారు. రేవంత్ ఎల్లారెడ్డి సభలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు, నాయకులు లేనేలేరని, అంతా బయటినుంచి తెచ్చుకొన్నవాళ్లే ఉన్నారని తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్లో ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్తో కలిసి సురేందర్ మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో రేవంత్, తాను ఇద్దరం కాంగ్రెస్ బీఫాంపైనే పోటీ చేశామని, ఆ ఎన్నికల్లో తాను గెలిచానని, రేవంత్ పోటు మెనగాడే అయితే ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు.
ఎల్లారెడ్డిలో పెట్టిన కాంగ్రెస్ సభను చూస్తుంటే జాలేస్తున్నదని, ఆ సభ వేదికపై ఒక్క ఎల్లారెడ్డి నాయకుడు కూడా లేరని అన్నారు. అసలు రేవంత్కు, కాంగ్రెస్కు ఏమైనా సంబంధం ఉన్నదా? ఆయనెప్పుడు కాంగ్రెస్లో చేరారని అడిగారు. నియోజకవర్గ అభివృద్ధి, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసంతోనే టీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి రేవంత్రెడ్డికి లేదని సురేందర్ ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశమే చూస్తున్నదని, ఇప్పటికే రెండుసార్లు ఆయనను ప్రజలు సీఎంను చేశారని, మరో నాలుగు సాైర్లెనా సీఎంను చేస్తారని తేల్చి చెప్పారు.
ఈ రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఉన్నాయా? అని రేవంత్ను ప్రశ్నించారు. ఎల్లారెడ్డి గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని, సిద్దిపేట తర్వాత టీఆర్ఎస్కు అండగా నిలిచిన నియోజకవర్గమని వెల్లడించారు. సీఎం కేసీఆర్కు ప్రతి రంగంపై అవగాహన ఉన్నదని, ఆహార చట్టం కేంద్ర పరిధిలోనిదేనన్న విషయం కూడా రేవంత్కు తెలియటం లేదని విమర్శించారు. చెరుకు పరిశ్రమ సహా తెలంగాణలోని అనేక పరిశ్రమలు మూతపడటానికి కారణం కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మరోసారి బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు.
జహీరాబాద్ను అభివృద్ధి చేసిందే టీఆర్ఎస్: బీబీపాటిల్
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ బీబీపాటిల్ చెప్పారు. అనేక రహదారులను జాతీయ రహదారులుగా మార్చామని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి జహీరాబాద్కు నిమ్జ్ను తీసుకొచ్చామని, ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అనేక పనులను తాను ఎంపీ అయ్యాక చేసి చూపించానని చెప్పారు. జహీరాబాద్కు అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందున్నదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటంతో ఆ ఫ్రస్ట్రేషన్ రేవంత్రెడ్డిలో కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ శోభ, నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.