బెజ్జూర్ : మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన పోచమ్మ ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని పోచమ్మ తల్లిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం బెజ్జూర్ రంగనాయక ఆలయాన్ని సందర్శించారు. అసెంబ్లీలో మన్నేవారి సేవా సంఘం ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఆయన వెంట నాయకులు మనోహర్ గౌడ్, భాస్కర్ రాజు, సామర్ల తిరుపతి, జాడి దిగంబర్ నీలేష్, తదితరులు పాల్గొన్నారు.