హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ జేపీ మౌలాలీ, పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాల్లో కొనసాగుతున్న పనులు.. అజ్మీర్ దర్గా వద్ద రుబాత్, కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణాలకు ఉన్న అడ్డంకులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పనులపై శనివారం మంత్రులు నాలుగు గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో జేపీ దర్గా వద్ద పార్టీ ముఖ్యులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్గాను సందర్శించి విస్తరణ, అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని, సంబంధిత వ్యాపారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆదేశించారు. అజ్మీర్ దర్గా వద్ద రుబాత్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా అధికారులను కోరారు.
నగరంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 11 విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి త్వరలో మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. పహాడీషరీఫ్ దర్గా వద్ద ర్యాంప్, సీసీ రోడ్డు, మౌలాలీ దర్గా, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాల్లో కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులకు పలు సూచనలు చేశారు.