కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తన సతీమణి నీరజారెడ్డి, స్నేహితులు అందించిన రూ.1.5 కోట్ల ఆర్థిక సహాయంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బాల్కొండ నియోజక వర్గంలోని అన్ని పీహెచ్సీల్లో 102 ఆక్సిజన్ బెడ్లు, 18 ఐసీయూ బెడ్లను ఏర్పాటుచేశామని తెలిపారు. మంగళవారం పలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ విపత్తు వేళ ఎంతోమంది పేదలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఇకముందు నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో స్నేహితుల సహకారంతో దవాఖానల్లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని దవాఖానల్లో 102 ఆక్సిజన్ బెడ్లు, మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్ దవాఖానల్లో 18 ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.