హైదరాబాద్ : రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ నేడు ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో వందన సమర్పణ అవకాశం కలుగడం గర్వంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో అధికారంలోకి వచ్చిందన్నారు.
ఉద్యమ నాయకుడే మన ముఖ్యమంత్రి కావడం.. ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ కార్యకర్తగా గర్వపడుతున్నానన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో బాలారిష్టాలు దాటుకుని, వ్యక్తి కేంద్ర బిందువుగా మానవీయ కోణంలో సంక్షేమ పరిపాలన అందిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ కార్యకర్తగా ప్రభుత్వంలో భాగస్వామిగా అవకాశం పొందినందుకు గర్వపడుతున్నానన్నారు. 9వ సారి ఏకగ్రీవంగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎంకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.